సీఎంగా నవంబరు 20 న ప్రమాణస్వీకారం

పాట్నా: జేడీయూ సుప్రీం నితీశ్ కుమార్ ఎన్డీయే (NDA) నేతగా బుధవారంనాడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో ఆయన బిహర్ ముఖ్యమంత్రిగా 10వ సారి ప్రమాణస్వీకారానికి మార్గం సుగమమైంది. పాట్నాలోని గాంధీ మైదానంలో గురువారం మధ్యాహ్నం 11.30 గంటలకు నితీశ్ కుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారు.
ఏకగ్రీవంగా ఎన్నిక
ఎన్డీయేకు చెందిన 202 మంది ఎమ్మెల్యేలు మధ్యాహ్నం 3.30 గంటలకు పాట్నాలో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో నితీశ్ను ఎన్డీయే నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దిలీప్ జైశ్వాల్, సామ్రాట్ చౌదరి, చిరాగ్ పాశ్వాన్, కేశవ్ ప్రసాద్ మౌర్య, విజయ్ కుమార్ సిన్హా, రాజు తివారి తదితరులు హాజరయ్యారు. నితీశ్ కుమార్ పేరును సామ్రాట్ చౌదరి ప్రతిపాదించగా, ఎమ్మెల్యేలంతా బలపరిచారు.
గవర్నర్తో సమావేశం
ఎన్డీయే నేతగా నితీశ్ కుమార్ ఎన్నికకావడంతో ఆయన గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ను ఈసాయంత్రం కలుసుకోనున్నారు. ఎన్డీయే భాగస్వామ్య పార్టీల మద్దతు లేఖను గవర్నర్కు సమర్పిస్తారు. ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కోరుతారు.
బీజేపీకే డిప్యూటీ సీఎం పదవులు
కాగా, కొత్త మంత్రివర్గంలో బీజేపీ నేతలు సామ్రాట్ చౌదరి, విజయ్ సిన్హా తిరిగి ఉప ముఖ్యమంత్రులుగా కొనసాగనున్నారు. ఈ మేరకు బీజేపీ ఎల్పీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే 243 స్థానాల్లో 202 స్థానాలు గెలుచుకుని అఖండ విజయం సొంతం చేసుకుంది. ఎన్డీయే ప్రధాన భాగస్వామ్య పార్టీ అయిన బీజేపీ 89 సీట్లు గెలుచుకుని బిహార్లో ఏకైక పెద్ద పార్టీగా నిలిచింది. ఆ తర్వాత స్థానంలో 85 సీట్లతో ఆర్జేడీ నిలిచింది. ఎన్డీయే కూటమిలోని ఎల్జేపీఆర్వీ 19 సీట్లు, హెచ్ఏఎం 5, ఆర్ఎల్ఎం 4 సీట్లు గెలుచుకున్నాయి..
