315 కీలక ప్రగతి సూచికల్లో జిల్లా నెం.1
జిల్లా స్థూల ఉత్పత్తి లో నెం.2కు చేరుకోవాలి
- స్వర్ణాంధ్ర @2047 లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయాలి
- ప్రతి నియోజకవర్గంలోనూ ఎంఎస్ఎంఈ పార్కులు
- జిల్లా సమీక్షా కమిటీ సమావేశంలో వైద్యఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్
తెలుగు ట్రాక్,విజయవాడ,డిసెంబర్ 26:
స్వర్ణాంధ్ర @ 2047 లక్ష్యాల సాధన దిశగా చేస్తున్న ప్రయాణంలో వివిధ శాఖలకు సంబంధించి 315 కీలక ప్రగతి సూచిక (కేపీఐ)ల్లో 83 స్కోరుతో జిల్లా రాష్ట్రంలోనే నెం.1గా నిలిచిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ జిల్లా యంత్రాంగాన్ని అభినందించారు. అయితే ఫ్రంట్ రన్నర్గా ఉన్న జిల్లా ఏ ప్లస్ అచీవర్ స్థాయికి చేరుకునేందుకు కృషిచేయాలని,చంద్రబాబు ఆకాంక్షలకు అనుగుణంగా పాలనలోనూ, సేవల పంపిణీలోనూ స్పీడ్ ఆఫ్ డూయింగ్ స్ఫూర్తితో పనిచేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు సత్యకుమార్ యాదవ్ అన్నారు.
శుక్రవారం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సత్యకుమార్ యాదవ్ అధ్యక్షతన నగరంలోని ఇరిగేషన్ కాంపౌండ్ రైతు శిక్షణ కేంద్రంలో 4వ జిల్లా సమీక్షా కమిటీ (డీఆర్సీ) సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కలెక్టర్ డా. జి.లక్ష్మీశ, శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్ తాతయ్య, యార్లగడ్డ వెంకట్రావు, ఎమ్మెల్సీలు మొండితోక అరుణ్కుమార్, రుహుల్లా, ఏపీ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ అడ్వయిజరీ కమిటీ ఛైర్మన్ గొట్టుముక్కల రఘురామరాజు, జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ఎం తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. గత డీఆర్సీ సమావేశంలో ప్రజాప్రతినిధులు లేవనెత్తిన వివిధ అంశాలపై తీసుకున్న చర్యలపై చర్చించారు. ఎన్ని అంశాలు పరిష్కారమయ్యాయి? వివిధ దశల్లో ఉన్నవి ఎన్ని? సమాచారాన్ని విశ్లేషించి ప్రతి అంశానికీ కచ్చితమైన పరిష్కారం లభించేలా కార్యాచరణకు మంత్రివర్యులు దిశానిర్దేశం చేశారు. పరిశ్రమలు, వైద్య ఆరోగ్యం, రహదారులు, వ్యవసాయ అనుబంధ రంగాలు, శాంతిభద్రతలు, పోలీస్ కమిషనరేట్ అమలుచేస్తున్న వినూత్న కార్యక్రమాలు, జీవో నెం.30 అమలు, పీఎం సూర్యఘర్ తదితరాలపై సమావేశంలో చర్చించారు. రెవెన్యూ సేవలు, సమస్యల పరిష్కారానికి సంబంధించిన దరఖాస్తుల సత్వర పరిష్కారం, రహదారుల పనుల్లో వేగవంతం, విజయవాడ రూరల్ పరిధిలో సురక్షిత తాగునీరు, పారిశుద్ధ్యం, సీజనల్ వ్యాధుల కట్టడి, ఎ.కొండూరు కిడ్నీ వ్యాధిగ్రస్థులకు అందిస్తున్న సేవలు తదితరాలకు సంబంధించి గౌరవ ప్రజాప్రతినిధులు వివిధ అంశాలను సమావేశం దృష్టికి తీసుకురాగా అధికారులు వివరణ ఇచ్చారు. ఆయా అంశాల కార్యాచరణకు మంత్రివర్యులు సూచనలు చేశారు. శాసనభ్యులు శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య).. రెవెన్యూ సేవల దరఖాస్తుల పరిష్కారంపై ప్రత్యేకంగా దృష్టిసారించాల్సిన అవసరముందన్నారు.
