
మూడు ప్రాంత్రాల సమగ్ర అభివృద్ధికి కార్యాచరణ
సీమలో 20 లక్షల ఎకరాల్లో ఉద్యాన సాగులక్ష్యం
పూర్వోదయ పథకం ప్రతిపాదనలపై సమీక్షలో సీఎం చంద్రబాబు
తెలుగు ట్రాక్,అమరావతి, డిసెంబర్ 9 : పూర్వోదయ పథకం కింద రాష్ట్రానికి వచ్చే నిధులతో మూడు ప్రాంతాల అభివృద్ధికి సత్వరం ప్రతిపాదనలు రూపొందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఈ నిధులు సాగునీటి ప్రాజెక్టులు, ఉద్యానపంటల విస్తరణ, గ్రామీణ రహదారులు వంటి మౌలిక వసతుల కల్పనకు వినియోగించేలా ప్రణాళికలు ఉండాలని సీఎం సూచించారు. సచివాలయంలో పూర్వోదయ, సాగునీటి ప్రాజెక్టులపై అధికారులతో మంగళవారం సీఎం సమీక్షించారు. ప్రకాశం సహా, రాయలసీమలోని 82 క్లస్టర్లలో ఉద్యాన పంటల కేంద్రంగా అభివృద్ధి… 20 లక్షల ఎకరాల్లో ఉద్యానవన పంటలను విస్తరించేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు. పూర్వోదయ స్కీమ్లో భాగంగా రూ.40 వేల కోట్లు వివిధ ప్రాజెక్టులను చేపట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. ఇందులో రూ.20 వేల కోట్లు సాగునీటి ప్రాజెక్టులకు, మిగిలిన రూ.20 వేల కోట్లతో మౌలిక వసతుల ప్రాజెక్టులు చేపట్టాల్సి ఉందని… అందుకు అనుగుణంగా కార్యాచరణ ఉండాలన్నారు.
త్వరలో పోలవరం-నల్లమల సాగర్ పనులు
రూ.58,700 కోట్లతో పోలవరం – నల్లమల సాగర్ ప్రాజెక్టుల అనుసంధానంపైనా చర్చించారు. దీంతో నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో కొత్తగా 7 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించే అవకాశం ఉంటుందని అధికారులు అన్నారు. మరో 6 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ, 60 లక్షల మందికి తాగునీరు అందుతుందని వివరించారు.
ఉత్తరాంధ్రలోనూ ఉద్యాన పంటలు
ఉత్తరాంధ్రలో సాగు నీటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని చెప్పిన ముఖ్యమంత్రి… ఇందుకోసం రూ.5 వేల కోట్లతో వివిధ ప్రాజెక్టుల పూర్తికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలు ఆయిల్ పామ్కు, ఇతర ఉద్యాన పంటలకు అనుకూలమని…. ఉత్తరాంధ్రలోని ఏజెన్సీ జిల్లాల్లో నేచురల్, ఆర్గానిక్ ఫార్మింగ్ను ప్రోత్సహించాలని సీఎం సూచించారు. రూ.169 కోట్లతో వంశధార-నాగావళి, చంపావతి నదుల అనుసంధానం చేపట్టేలా కార్యాచరణ చేపట్టాలన్నారు. . సమీక్షకు ఆర్ధిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.
