- తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మధ్య నిరంతర సమన్వయం అవసరం
- కేరళ తరహా విద్యావిధానం అమలు అవసరం
- జెన్ జీ కాలంలో విభిన్న రంగాల్లో సృజన అందరికీ అవసరం
- చిలకలూరిపేట శారదా జడ్పీ హైస్కూల్ లో నిర్వహించిన మెగా టీచర్స్ – పేరెంట్స్ మీటింగ్ లో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

తెలుగు ట్రాక్,గుంటూరు:
‘తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు సుహృద్భావ సంబంధాలుండాలి. వారి మధ్య ఎంతటి మంచి వాతావరణం ఉంటే పిల్లల్లోనూ అట్లాంటి పాజిటివ్ దృక్పథం ఏర్పడుతుంది. జీవితంలో ఎదగాలంటే క్రమశిక్షణ అనేది ప్రతి ఒక్కరికీ అవసరం. మీ వ్యక్తిత్వం లేదా చదువు విషయాల్లో గురువులు ఒక దెబ్బ వేస్తే దాన్ని సీరియస్ గా తీసుకోవల్సిన అవసరం లేదు. అవి మనం ఆకాశమంత ఎదిగిన తర్వాత గురువు ఆశీర్వాదాలుగా గుర్తుండిపోతాయ’ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పారు. పాఠశాలల్లోని విషయాలను కూడా రాజకీయం చేసేందుకు చాలా మంది సిద్ధంగా ఉన్నారని, ఇటీవల పిఠాపురంలో జరిగిన చిన్న సంఘటనకు రాజకీయ రంగు పులిమి చిన్నారులను దానిలోకి లాగే ప్రయత్నం చేశారని ఆయన విమర్శించారు. ఇలాంటి వారి పట్ల పెద్దలు, పిల్లలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. వేలాది ఎకరాలను కొల్లగొట్టే ఘనులు ఉన్న సమాజంలో పిల్లలకు ఆడుకోవడానికి పాఠశాలల్లో ఆటస్థలాలు లేకపోవడం విచారకరమని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశాల్లో భాగంగా చిలకలూరిపేట శారదా జడ్పీ హైస్కూలులో పవన్ కళ్యాణ్ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగాఆయన మాట్లాడుతూ… ‘‘నేటి రోజుల్లో విభిన్న సృజన అనేది ప్రతి విద్యార్థికి అవసరం. గురువులు కూడా కేవలం విద్యార్థులను జీతగాళ్లుగా తయారు చేసే పద్ధతికి స్వస్తి చెప్పి, దేశానికి పనికొచ్చేలా తీర్చిదిద్దాలి. పిల్లల్లోని సృజనను గుర్తించి వారిని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దే బాధ్యతను తీసుకోవాలి. కేరళ తరహాలో విద్యార్థి, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మధ్య నిరంతరం సమన్వయం చేసుకునేలా ముందుకు సాగాలన్నారు. .
