
లిక్కర్ స్కామ్ లో కవితకు నోటీసులు
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు దేశంతోపాటు తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపిన విషయం తెలిసిందే. మొదటనుంచి ఎన్నో మలుపులు తిరుగుతున్న లిక్కర్ స్కామ్ కేసు.. హైదరాబాద్కు చెందని వ్యాపారవేత్త అరుణ్ పిళ్లై అప్రూవర్గా మారడంతో మళ్లీ సెగలు పుట్టిస్తోంది. విచారణను వేగవంతం చేసిన ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ (ఈడీ) బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కవితకు మళ్లీ నోటీసులు జారీ చేసింది. శుక్రవారం విచారణకు హాజరుకావాలంటూఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ నోటీసులు జారీ చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితకు వ్యాపారవేత్త అరుణ్ పిళ్లై బినామిగా ఈడీ అభియోగాలు మోపింది. ఈ మేరకు ఎఫ్ఐర్ కాపీలో కూడా ప్రస్తావించింది. ఇప్పటికే కవితను విచారించిన ఈడీ.. మరోసారి విచారణకు రావాలంటూ నోటీసులు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. అయితే, అరుణ్ పిళ్లై అప్రూవర్ గా మారి వాంగ్మూలం ఇచ్చిన నేపథ్యంలో కీలక ఆధారాలు సేకరించేందుకు కవితకు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. అయితే, దీనిపై కవిత ఎప్పుడు . విచారణకు హాజరవుతారా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక కవిత ఆడిటర్ గా పని చేసిన బుచ్చిబాబు కూడా అప్రూవర్ అయ్యారని చెబుతున్నారు. ఆయన దగ్గర నుంచి ఇటీవల స్టేట్ మెంట్లు కూడా మళ్లీ తీసుకున్నారు. ఇక సౌత్ లాబీలో మిగిలింది కవిత మాత్రమే. ఇప్పుడు విచారణకు పిలవడంతో ఎలాంటి పరిణామాలు ఉంటాయన్న చర్చ జరుగుతోంది. అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలో 2021, 2022లో రూపొందించిన ప్రభుత్వ ఎక్సైజ్ పాలసీపై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా జూలైలో సీబీఐ విచారణకు సిఫార్సు చేశారు. గతేడాది నవంబర్ 17న అమలులోకి వచ్చిన ఈ విధానంలో భాగంగా నగరాన్ని 32 జోన్లుగా విభజించి 849 షాపులకు సంబంధించి ప్రైవేట్ బిడ్డర్లకు రిటైల్ లైసెన్సులు ఇచ్చారు. ఈ విధానాన్ని బీజేపీ, కాంగ్రెస్లు వ్యతిరేకిస్తూ ఎల్జీకి ఫిర్యాదు చేశాయి. ఎల్జీ ఆదేశంతో మొదట సీబీఐ.. సీబీఐ కేసుల ఆధారంగా ఈడీ రంగంలోకి దిగాయి. వరుసగా అరెస్టులు చేశాయి. అరబిందో శరత్ చంద్రారెడ్డి, మాగుంట శ్రీనివాసులరెడ్డి, మాగుంట రాఘవరెడ్డి, అరుణ్ రామచంద్ర పిళ్లైను బినావిూగా పెట్టుకుని కవిత ఢిల్లీలో మద్యం వ్యాపారం చేసినట్లుగా గుర్తించి కేసులు నమోదు చేసింది. విచారణ జరిపి దాఖలు చేసిన చార్జిషీట్లో కవిత బినావిూ ఆస్తుల వివరాలనూ వెల్లడిరచింది. ఢిల్లీలో మద్యం వ్యాపారంలో సాధించిన లాభాలతో హైదరాబాద్లో కవిత భూములు కొనుగోలు చేశారని, ఇందులో సౌత్గ్రూపుదే కీలకపాత్ర అని ఈడీ కోర్టుకు తెలిపింది. భూముల కొనుగోలు వ్యవహారంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత భర్త అనిల్కుమార్ ప్రమేయం ఉందని తెలిపింది. గౌతమ్ మల్హోత్రా, అమన్దీప్, మాగుంట రాఘవ, అరుణ్ పిళ్లై వాంగ్మూలాల ఆధారంగా రెండు చార్జిషీట్లను దాఖలు చేసింది. ఆప్ నేతలకు సౌత్గ్రూపు రూ.100 కోట్లు హవాలా రూపంలో ముడుపులిచ్చింది. తద్వారా మద్యం విధానం తమకు అనుకూలంగా ఉండేలా చూసుకుంది. తర్వాత అందర్నీ అంటే కవిత తరపున వ్యవహారాలు చక్క బెట్టినట్లుగా భావిస్తున్న అరుణ్ పిళ్లై, అభిషేక్ , బుచ్చిబాబు వంటి వారి వాంగ్మూలాలతో కవిత నేరం చేసినట్లుగా ఈడీ లెక్కలేసింది. వారందరూ దాదాపుగా అప్రూవర్లు అయ్యారు.