కొత్త ప్రభాకర్ రెడ్డి పై కత్తితో దాడిపై పోలీసుల విచారణ
ప్రాథమిక విచారణలో వెల్లడైందని తెలిపిన పోలీస్ కమిషనర్ శ్వేత
మెదక్ ఎంపీ, దుబ్బాక నియోజవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి పై కత్తితో దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి సిద్దిపేట పోలీస్ కమిషనర్ కార్యాలయంలో పోలీస్ కమిషనర్ శ్వేత విూడియా సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడిరచారు. ఈ నెల 30రోజున సూరంపల్లిలో కొత్త ప్రభాకర్ రెడ్డి పై కత్తితో దాడి జరిగిందని, ప్రజల ఆగ్రహంతో ఎంపీపై కత్తితో దాడి చేసిన వ్యక్తి పై దాడి చేశారని, అతడు గాంధీ దవాఖానలో చికిత్స పొందుతున్నాడని పేర్కొన్నారు.ఈ కేసులో అన్నీ ఆధారాలు సేకరించాం. దాడి చేసిన వ్యక్తి పలు న్యూస్ ఛానల్స్ రిపోర్టర్ గా పనిచేస్తున్నాడు. వారం రోజుల క్రితం నిందితుడు ప్రణాళిక ప్రకారం కత్తిని కొనుగోలు చేశాడని వివరించారు. నిందుతుడిని బుధవారం కోర్టు ముందు హాజరు పరచగా జడ్జి 14రోజుల రిమాండ్ విధించారని పేర్కొన్నారు. నిందుతునికి ఎవరైనా సహకారం ఉందా అనే కోణంలో విచారణ కొనసాగిస్తున్నామని చెప్పారు.ఈ కేసుకు సంబంధించి సోషల్ విూడియాలో విద్వేషాలు రెచ్చగొట్టే పోస్టులు పెట్టవద్దని సూచించారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో కొనసాగేలా చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. ప్రస్తుతానికి నిందుతుడు రాజు ఎవరి సహకారం తీసుకోలేదని, అతడు ఒక్కడు మాత్రమే నేరంలో పాల్గొన్నట్లు తెలిపారు. నిందుతుడు సెన్సేషన్ క్రియేట్ చేయడానికే దాడి చేసినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైందని సీపీ చెప్పారు.